Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:35 pm Posted by : ramakrishna

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యం

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యమని, పదవీ విరమణ పొందిన సిబ్బంది పోలీస్ శాఖకు అందించిన సేవలు చిరస్మరణీయమని నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కొనియాడారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో జూలై నెలలో పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ సిబ్బందికి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన సిబ్బందిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో సి.టి.సి., జాన్కంపేట్ నిజామాబాద్‌కు చెందిన ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ వి.శివరాం 42 సంవత్సరాల సుదీర్ఘ సేవలను పూర్తి చేశారు. ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్‌కు చెందిన ఆర్.ఎస్.ఐ చిట్టమల్ల ముత్తయ్య పోలీస్ శాఖలో 36 సంవత్సరాల సేవలు అందించి పదవీ విరమణ పొందారు. అదే విధంగా ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్‌ కు చెందిన ఏ.ఆర్. ఎస్.ఐ కంటేదారి లక్ష్మణరావు 42 సంవత్సరాల సేవలను పూర్తి చేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో అధిక పనిభారం మధ్య అంకితభావంతో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కులు లేకుండా పదవీ విరమణ పొందడం గొప్ప విషయమని అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా వారికి ఎలాంటి అవసరం వచ్చినా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పదవీ విరమణ పొందిన అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని, వారి పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ శ్రీరాములు, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, ఎ.జగతి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్ పెక్టర్ (అడ్మిన్) ధరణి కుమార్, ఎంటీఓ ఎస్.శేఖర్ బాబు, వెల్ఫేర్/హోంగార్డ్స్ విభాగం సతీష్ తదితరులు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.