. . . పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శాంతియుతంగా నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడడం అన్యాయమని, అది భారత ప్రజాస్వామ్యంపై దాడితో సమానమని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విమర్శించారు. న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో గత 22 రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగులు చేపడుతున్న నిరాహార దీక్షలకు మద్దతుగా నిర్వహించిన శాంతియుత పార్లమెంట్ నిరసన ర్యాలీపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, వాటర్ క్యానన్లు ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. ఈ ఘటనతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ సందర్భంగా అరెస్టు చేసిన అభిజిత్ దీప్కేతో పాటు వేలాది మంది విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను అణచివేయకుండా, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ విజ్ఞప్తి చేసింది.