. . . ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశింధర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యార్థుల సమస్యల పరిష్కారం, దేశభక్తి, నాయకత్వ లక్షణాల పెంపు లక్ష్యంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ సంస్థ నిరంతరం పనిచేస్తోందని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశింధర్ తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కైరి శశింధర్ హాజరై విద్యార్థులకు సభ్యత్వ రశీదులను అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949 జూలై 9న కొద్దిమంది సభ్యులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందన్నారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఏబీవీపీ నిరంతరం పోరాటం చేస్తోందని ఆయన చెప్పారు. ఉద్యమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఏబీవీపీ ముందుంటుందని పేర్కొన్నారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు అందేలా చర్యలు తీసుకోవడం, నిరుపేద విద్యార్థుల బస్పాస్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎంసెట్, పాలీసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ను ఏబీవీపీ ఆధ్వర్యం లో అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు స్పందించే సంస్థగా ఏబీవీపీ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంఘటన మంత్రి బద్దిగే శివ ప్రసాద్తో పాటు సౌరబ్, చెర్రీ, దీపంత్, పుల్వంత్, శశాంక్, దుర్గాదాస్, బాలు శ్రీశాంత్, తిరుపతి, నితీష్ తదితరులు పాల్గొన్నారు.
