Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 4:57 pm Posted by : ramakrishna

రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయండి

 

. . . గెలుపు ఎవరిదో చూపిస్తాం

 

. . . మానాల మోహన్ రెడ్డి సవాల్

 

భీంగల్, బతుకమ్మ :

 

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని ప్రజలకు తెలియజేస్తున్నాయని రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం భీంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఒకరని పేర్కొన్నారు. రాకేష్ రెడ్డి మాదిరిగా పారాచూట్ నాయకుడిగా వచ్చి టికెట్ పొందిన వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. రాకేష్ రెడ్డికి ప్రజా సమస్యలపై అవగాహన కంటే యూట్యూబ్ ఛానళ్లలో విమర్శలు చేయడం, అధికార పార్టీలోని పెద్దలను కలవడం మాత్రమే తెలుసని మోహన్ రెడ్డి ఆరోపించారు. ఉదయం కాంగ్రెస్ నాయకులను కలిసి అభివృద్ధి పనులు చేయించుకుని, సాయంత్రం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన రాజీనామా సవాల్‌పై స్పందిస్తూ, పీసీసీ అధ్యక్షుడితో పోటీ చేయాల్సిన అవసరం లేదని, జిల్లాలో కాంగ్రెస్‌కు చెందిన ఏ నాయకుడి పేరునైనా ప్రకటిస్తే ఆ నాయకుడితో పోటీకి సిద్ధం చేస్తామని మోహన్ రెడ్డి తెలిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే తాము రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాకేష్ రెడ్డికి నిజంగా ప్రజలపై, తన పనితీరుపై నమ్మకం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరాలని మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. గత రెండున్నరేళ్లలో నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవల ఆధారంగా ప్రజలు తీర్పు ఇస్తారని, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి తీరుతాడనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.