Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2024, 8:47 pm Posted by : ramakrishna

బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాల్సిందే

. . . త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్ కు తెలంగాణ జాగృతి నివేదిక

. . .  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  

బతుకమ్మ, నిజామాబాద్ : 

 

కుల సర్వే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి సంస్థ నిర్ణయించింది.తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావుకు జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివేదికను అందించనున్నారు.ఈ మేరకు శుక్రవారం  హైదరాబాద్ లోని  తన నివాసంలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై కొన్ని నెలల క్రితం జాగృతి అధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించిన సంగతి విధితమే, ఆ సమావేశాల్లో తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. వాటిని క్రోడీకరించి తెలంగాణ జాగృతి నివేదికను రూపొందించింది. జిల్లాల వారీగా పూర్తి వివరాలు, బీసీల లెక్కలతో తెలంగాణ జాగృతి సమగ్ర నివేదికను రూపొందించింది. తెలంగాణ సామాజిక స్వరూపాన్ని ఆవిష్కరించే విధంగా పకడ్బందీగా నివేదికను తయారు చేశారు. నివేదిక రూపకల్పనతో బీసీ నాయకులు, విద్యావేత్తలు, మేధావులు, ఇతర నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇదే తరహాలో నివేదిక సమర్పించడం గమనార్హం. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని తెలిపారు. సమాజంలో అంతరాలను రూపుమాపడానికి, బలహీనవర్గాలను మరింత పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేను నామమాత్రంగా కాకుండా పకడ్బందీగా చేసి రిజర్వేషన్లు పెంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు గత 17 సంవత్సరాలుగా అనేక అంశాల్లో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ  సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో క్రీయాశీకలంగా వ్యవహరించింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కల్వకుంట్ల కవిత  నాయకత్వంలో తెలంగాణ జాగృతి అవిశ్రాంతంగా పోరాటం చేసిందని అన్నారు.

Reservations should be increased for BCs in the political field