నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలో ఎన్నో ఏళ్ళుగా తిష్టవేసి ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నగర కార్యదర్శి బెజుగాం సుజాత ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు శనివారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగరంలో పలు డివిజన్ లలో సిసి రోడ్లు ,మురికి కాలువలు, డ్రైనేజీ లీకేజీలు, దోమల బెడద, కుక్కల బెడద విపరీతంగా ఉండడంతో వీటివల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మంచినీటి సమస్య ప్రతి వార్డులో ఉందని, అలాగే ప్రధానంగా హమాల్ వాడి, నాందేవ్ వాడ, అంబేద్కర్ కాలనీ ,దుబ్బ, మిర్చి కంపౌండ్, రోటరీ నగర్, గాజులపేట్, ఆటోనగర్, నాగారం 80 క్వార్టర్స్, ఆర్ జి కే అపార్ట్ మెంట్స్, టైలర్స్ కాలనీ, 300 క్వాటర్స్, దొడ్డి కొమురయ్య నగర్, అసద్ బాబా నగర్, భారత్ రాణికాలనీ, బహుజన కాలనీలో ఎక్కువ సంఖ్యలో నిరుపేద ప్రజలు నివసిస్తారన్నారు. మున్సిపల్ కమిషనర్ ఈ వార్డులలో ప్రత్యేక దృష్టి పెట్టి, ఈ వార్డులను ఒకసారి సందర్శించి వారి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేశారు. ప్రజలకు కనీస సౌకర్యాల కల్పించకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఎం నగర నాయకులు పడివాల అనిత, నల్వాల నరసయ్య, అంజయ్య, సంగీత తదితరులు పాల్గొన్నారు.