నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42% విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ బిల్లులను రాజ్యాంగ 9వ షెడ్యూల్ లో చేర్పు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కో కన్వినర్ ప్రేమ్ కుమార్ గారు మాట్లాడుతూ.. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేయాలని, అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ నిధులను బిసి విద్యా, ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం తక్షణమే 40,000 కోట్లు కేటాయించి ఖర్చు చేయాలని హామీలను పూర్తిగా అమలు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు మహిపాల్, సాగర్ చారి, ప్రశాంత్, మైపాల్, గోపి తదితరులు పాల్గొన్నారు.