. . . నవోదయ విద్యాలయం తరగతులకు ఆటంకాలు ఉండొద్దు
. . . అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, బతుకమ్మ:
తాత్కాలిక భవనాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను శరవేగంగా జరిపించాలని, నవోధయ విద్యాలయంలో నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యే ఈ నెల 12 లోపు పనులను పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు అధికారులను అదేశించారు. జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) కళాశాల ఆవరణలోని భవన సముదాయాలలో తాత్కాలికంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం డైట్ కాలేజీని సందర్శించి, తరగతుల నిర్వహణకు అనువైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఏడాది నుండే తరగతులను నిర్వహించనున్న దృష్ట్యా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు.. ప్రస్తుత విద్య సంవత్సరంలో జవహర్ నవోదయలో ఆరవ తరగతిలో ప్రవేశాలు చేపట్టి తరగతులను నిర్వహించడం జరుగుతుందని, రెండు సెక్షన్లలో 80 మంది విద్యార్థిని, విద్యార్థులు ప్రవేశం పొందుతారని కలెక్టర్ అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బందికి తగిన వసతి, బోధనా తరగతుల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. తరగతి గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్, లైబ్రరీ, బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్ట్రర్స్ కోసం ఎంపిక చేసిన గదులను కలెక్టర్ పరిశీలించారు.. లీకేజీలు లేకుండా మరమ్మతు పనులను నాణ్యతతో జరిపించాలని, చెత్తాచెదారం, నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించి భవన సముదాయాలను పరిశుభ్రం చేయించాలని అన్నారు. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు జవహర్ నవోదయ విద్యాలయం డైట్ కళాశాల ప్రాంగణంలోని భవన సముదాయాల్లోనే కొనసాగనున్న నేపథ్యంలో, మరమ్మతు పనులు పక్కాగా జరిపించి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, జవహర్ నవోదయ విద్యాలయం ఇంచార్జ్ ప్రిన్సిపాల్ యోహన్నన్, పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్ తదితరులు ఉన్నారు.
