- 9 జిల్లాలో 2482 మందిని కాపాడిన యంత్రాంగం
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్నవర్షాభావ ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 27న ప్రారంభమైన వర్షం 29 వరకు కొనసాగింది. శుక్రవారం వరుణుడు శాంతించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్లా జిల్లా, సిద్దిపేట్ ప్రాంతాల్లో మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలకు అప్రమత్తమై ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం చేపట్టింది. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎస్ డీఆర్ఎఫ్), ఎన్ డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీస్, ఆర్మీని కూడా రంగంలో దించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మానేరు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు హెలిక్యాప్టర్ లను రంగంలోకి దించింది ఆర్మీ. కామారెడ్డి జిల్లాలో 1251 మందిని కాపాడారు. అందులో 600 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. మెదక్ జిల్లాలో 360 మంది విద్యార్థులను, ఇద్దరు గర్భిణిలను కాపాడారు. నిజామాబాద్ జిల్లాలో వాడి గ్రామంలో 380 మంది గ్రామస్తులను, హంగర్గలో 250 మందిని, 8 మంది సాధువులను కాపాడారు. సూర్యపేట్ జిల్లాలో గొండ్రియాలలో వరద నీటిలో గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ డీఆర్ఎఫ్, ఎన్ డీఆర్ఎఫ్ తో పాటు స్థానిక పోలీసులు రిస్క్ ఆపరేషన్లు కొనసాగించారు. ప్రజలను వరద ప్రాంతాల నుంచి తీసుకువచ్చేందుకు అవగాహన కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
