Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 April 2025, 3:20 pm Posted by : ramakrishna

రియల్ ఎస్టేట్ సీఎం రేవంత్

. హెచ్ సీయూ భూములను అమ్మనీయం, కొననీయం

. ఎంపీ ధర్మపురి అర్వింద్

హైదరాబాద్, బతుకమ్మ: రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అని, ఆయనకు భూములను అమ్ముడు, కమీషన్లు మింగుడు తప్ప వేరే ధ్యాస లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ తో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హెచ్ సీ యూ భూములు విక్రయించడం ద్వారా వచ్చే రూ.40వేల కోట్లలో రాహుల్ గాంధీకి కమీషన్ లేకపోతే వెంటనే రేవంత్ ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

రేవంత్ కు రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ చేతకాదని, ఆయన జేసీబీలు ఓల్డ్ సిటీ నడువవని అన్నారు. హెచ్ సీ యూను కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉందని, వర్సిటీ భూములను వెంటనే నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అనుబంధ విభాగమైన ఎన్ఎస్ యూ ఐ వ్యతిరేకిస్తున్నా రేవంత్ కు బుద్ధిరావడం లేదన్నారు.

హెచ్ సీ యూ భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నదని ప్రభుత్వం నడిపేందుకు కాదని, తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన గాంధీల కుటుంబానికి కమీషన్లు ఇచ్చేందుకే అమ్ముతున్నారని ఆరోపించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, 2,500 ఎకరాల భూమికి శాశ్వత ప్రహరీని నిర్మించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. హెచ్ సీయూ భూములను అమ్మనిచ్చేది, కొననిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.