Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2025, 7:27 pm Posted by : ramakrishna

హామీలపై సర్కార్ ను  ప్రశ్నించండి

  • కాంగ్రెస్ అన్యాయాలను నిలదీయండి
  • ప్రభుత్వ వెన్ను పోటు పై ప్రజల తిరుగు బాటు
  • మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

 

ఆర్మూర్, బతుకమ్మ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సర్కార్ ను  ప్రశ్నించండి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ అన్యాయా లను నిలదీయాల న్నారు.  ప్రభుత్వ వెన్ను పోటు పై ప్రజల తిరుగు బాటు జరుగుతోందన్నారు. ఏడాది దాటినా ఆరు గ్యారెంటీలకే గతి లేదు. ఇక ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామంటే నమ్మేదెవరు? అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల మంజూరు పేరుతో నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజల తిరుగుబాటు కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆరు గ్యారంటీలకే ఉప్పు పాతరేసి కొత్తగా ఈ డ్రామాలేమిటని ప్రజలు నిలదీస్తు న్నారన్నారు. ఎక్కడికక్కడ హామీల అమలుపై ఎమ్మెల్యేలను ప్రజలు నిలబెట్టి అడుగుతూ ఒరగబెట్టి కడుగుతున్నారు. ఆర్మూర్ లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై ఇళ్లు ఎప్పుడు కట్టిస్తావని మహిళలు తిరగబడ్డారని, భువనగిరి ఎమ్మెల్యే ను ఉరికిచ్చికొట్టారని ఆయన తెలిపారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు ఇస్తామని నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల సర్కస్ పీట్లు లోకల్ బాడీ ఓట్ల కోసం కాంగ్రెస్ పడుతున్న పాట్లు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇది పీపుల్స్ సర్కార్ కాదు, గ్రాఫిక్స్ సర్కార్ అని ఆయన ధ్వజమెత్తారు. అబద్దాలు చెబుతూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా ప్రజలకు నరకం చూపిస్తున్నారు. అమలుకాని ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది. గ్రామసభల టెంట్లు స్థానిక ఎన్నికల స్టంట్లు. ఇందిరమ్మ ఇళ్ళు ఎండమావిలో నీళ్లు. ఉత్తుత్తి రేషన్ కార్డ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎండ్ కార్డ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో హీరో కావాలని ఇన్ని మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ జీరో కాకతప్పదు అని ఆయన అన్నారు. గ్రామ సభల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే లేరని, మంత్రులు పత్తా లేకుండా పోయారని, ఎమ్మెల్యేలను గ్రామాలకు రానివ్వడం లేదని ఆయన చెప్పారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేరన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలంతా ప్రభుత్వ మోసాలపై నిరసన గళమెత్తాలని జీవన్ రెడ్డి పిలుపు నిచ్చారు.