. . . ప్రారంభమైన మాస్ కమ్యూనికేషన్ కార్యశాల
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఆధునిక యుగంలో నైపుణ్యం తో పాటు నాణ్యత ఎంతో అవసరమని వర్సిటీ ఉపకులపతి టి.యాదగిరిరావు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న స్క్రిప్ట్ టు స్క్రీన్ కార్యశాల బుధవారం ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వర్సిటీ ఉపకులపతి టి.యాదగిరిరావు మాట్లాడుతూ సాంకేతికతకు నైతికత తోడైనప్పుడు మాత్రమే వ్యవస్థలోని వాస్తవాలను పత్రికల ద్వారా లేదా విజువల్ మీడియా ద్వారా ప్రజలకు అందించగలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రామోజీరావు పత్రికా రంగానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ గంటా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ కార్యశాల విద్యార్థులకు సాంకేతిక తో పాటు నైపుణ్యాలు, నైతికతను వివరిస్తుందని తెలిపారు. వర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ పత్రిక రంగంలో శీర్షికల ఆవశ్యకత, ఆధునిక సామాజిక మధ్యమాలపై అవగాహన ఎంతో అవసరమని ఆయన తెలిపారు. కార్యశాలకు ముఖ్యవక్తగా విచ్చేసిన దీపక్ మాట్లాడుతూ సాంకేతికతను మనం విషయ విశదీకరణకు ఎలా ఉపయోగిస్తున్నామని చూడాలన్నారు. మరొక వక్త నరహరి మాట్లాడుతూ వాస్తవికతకు దగ్గరగా ఉండే విధంగా వార్తలు ఉండాలని ఫార్మాట్, టెక్స్ట్, టెర్మినాలజీ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. యు జి సి కోఆర్డినేటర్ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువ సమయాన్ని అధ్యయనానికి వినియోగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతాబాయి, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ మోహన్, డాక్టర్ ఎ. నాగరాజు, డాక్టర్ సాయిలు, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
