Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 5:55 pm Posted by : ramakrishna

కౌలాస్ కోటలో చతుర్భుజి సరస్వతి శిల్పం

 

జుక్కల్, బతుకమ్మ :

 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులోని జుక్కల్ మండలంలోని ప్రఖ్యాతిగాంచిన సంస్థానాలలో ఒకటైన కౌలాస్ సంస్థానంలోని 12-14వ శతాబ్దాల మధ్యకాలం నాటి ప్రాచీన కోటను శనివారం భీమ్‌గల్ మండలానికి చెందిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ సందర్శించారు. అనేక చారిత్రాత్మక కోటలు, ఫిరంగులు, కోటలోపల గల రాణి మహల్, ఏనుగులబావి, శిథిలమైన శివాలయం, ఆయుధశాలను పరిశీలించారు. శివాలయం పక్కనే పడి ఉన్న ఒక విగ్రహాన్ని కంకణాల రాజేశ్వర్ కనుగొన్నారు. వివరాలు తెలియ రాకపోవడంతో రాతి విగ్రహాన్ని ఫోటో తీసి కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ రామోజు హరగోపాల్ కు పంపడంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చరవాణిలో మాట్లాడిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ రామోజు హరగోపాల్ ఈ విగ్రహం కాకతీయ శైలికి చెందిన సరస్వతి విగ్రహంగా పేర్కొన్నారు. రామోజు హరగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం కీర్తి ముఖతోరణంతో ఉన్న చతుర్భుజి సరస్వతి శిల్పంగా పేర్కొంటూ, సరస్వతి పరహస్తాలలో అంకుశం, పాశాలను నిజ హస్తాలలో (అక్షరమాల, అభయహస్తం ఉండాల్సిన) కుడి చేయి విరిగింది. ఎడమ చేతిలో పుస్తకం ధరించి, అర్థ పద్మాసనంలో కనిపించిన సరస్వతి శిల్పం అందమైన హంస వాహనంగా చెక్కబడి ఉందని అన్నారు. ఇలాంటి ప్రాచీన చారిత్రాత్మక శిల్ప సంపదను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కంకణాల రాజేశ్వర్ అన్నారు.