కొలువు దీరుతున్న గ్రామదేవతలు
నగరంలో అంబరాన్నంటిన ఊర పండుగ సంబరాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరం పులోరియా అంటూ భక్తుల నినాదాలతో హోరెత్తింది.. ఇందూర్ నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఊర పండుగ ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని ఖిల్లా ప్రాంతంలో తేలు మైసమ్మ గద్దె నుంచి దేవతామూర్తుల ప్రతిష్ఠాపనకు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా కదిలాయి. జిల్లా అధికార యంత్రంగం పర్యవేక్షణలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఊర పండుగ సంబరాలు షురూ అయ్యాయి. తేలు మైసమ్మ గద్దె నుంచి పెద్దమ్మ, పోచమ్మ, పగడాలమ్మ, సార్గమ్మ,కొండల రాయుడు, భోగంసాని, మహాలక్ష్మమ్మ, రాట్నం (ఆసు), పెద్దపులి ప్రతిమలను వేడుకగా ఊరేగించారు. పెద్ద బజార్, కోట గల్లి,జండగల్లి, వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్ ప్రాంతాలలో అమ్మవార్లను ప్రతిష్ఠించేందుకు ఊరేగింపు కొనసాగుతోంది. జొన్నలు, పసుపు, కుంకుమలతో చేసిన సరి గంప ఊరేగిస్తూ ఊరేగింపు సందర్భంగా పంపిణీ చేశారు. భక్తులు దారి పొడవునా మేకలు కోళ్లను బలిస్తూ తమ మొక్కులను చెల్లించుకున్నారు. నగరంలోని వీధుల వెంట ఊర పండుగ దృశ్యాలు సంబరంగా కనిపించడం విశేషం. నగరంలో అమ్మవార్ల ఊరేగింపు సందర్భంగా భక్తులు అమ్మవారు ఆవహించిన పూనకాలతో ఊగిపోయారు. పులోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు ముందుకు సాగింది.


