హైదరాబాద్, బతుకమ్మ :
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణతో పాటు “ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా” పథకం అమలుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమావేశంలో పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. ప్రజా పాలన – ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాల రూపకల్పన, అమలు విధానం, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రతి పేద కుటుంబానికి భరోసా కల్పించే దిశగా “ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా” పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సి.వి. ఆనంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
