Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 7:04 pm Posted by : ramakrishna

వైట్ కాలర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలి

 

. . . సీ.ఎం.ఆర్ కేసులలో దర్యాప్తు వేగవంతం చేయాలని

 

. . . రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జిల్లాలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి పై కమిషనర్ సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల ఏ.సీ.పీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ.ఎం.ఆర్ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని, సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని, కోర్టుల్లో కేసుల ప్రాసిక్యూషన్ బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కేసుల పురోగతిని తరచూ సమీక్షిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

 

Public awareness program on white collar crimes should be organized

అలాగే ప్రధానంగా సైబర్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్‌లు, ఆర్థిక నేరాలు, నకిలీ పత్రాల తయారీ వంటి అంశాలపై చర్చించి, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బాధితులకు త్వరిత న్యాయం అందేలా చూడాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవే రోడ్డులను కలుపుతూ ఉండేటటువంటి లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయించాలని, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధంగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే, స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్,  మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏ.సి.పి బి.ప్రకాష్, బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, ఆర్మూర్ ఏ.సి.పి వెంకటేశ్వర రెడ్డి, సి.టి.సి ఏ.సి.పి రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీశైలం, సిసిఆర్బి సి.ఐ రమేష్, అంజయ్య, ఎం.టి.ఓ శేఖర్ బాబు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ శ్రీలత, సి.ఐలు, ఎస్సైలు ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.