నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతాంగ, వ్యవసాయ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య తెలిపారు. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడా పెట్టుబడిదారులకు ఆర్థికపరమైన మినహాయింపులను ఇస్తోందని, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి కార్మికులకు హక్కులు లేకుండా చేస్తోందని విమర్శించారు. రైతాంగ వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చి రైతుల పండించిన పంటకు మద్దతు ధర లేకుండా చేశారని, విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి విద్యుత్ ను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి నర్సింగరావు, కార్యదర్శి అనిల్, నాయకులు కండ్లకోయ గంగాధర్, రాధాకుమార్, సఖి సురేశ్ , అలీ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.