. ఎమ్మెల్యే హామీతో కిందికి దిగిన వైనం
. ఊపిరి పీల్చుకున్న స్థానికులు
. రూరల్ మండలం మల్లారంలో ఘటన
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అన్ని అర్హతలు తనకు ఉన్నాయని, ఇల్లు మంజూరవుతుందనే ఆశతో పనులు ప్రారంభిస్తే జాబితాలో తన పేరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన గురువారం ఉదయం రూరల్ మండలంలోని మల్లారంలో గ్రామంలో కలకలం సృష్టించింది.
గ్రామానికి చెందిన ఎం.సాయిలు తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందనే నమ్మకంతో ముందుగానే పనులు ప్రారంభించాడు. బేస్మెంట్ వరకు పూర్తి చేశాడు. అయితే ఇటీవల విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన సాయిలు గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు.
గ్రామస్తులు ఎంత నచ్చజెప్పినా కిందికి దిగకపోవడంతో నాయకులు ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సమాచారం అందించారు. ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో సాయిలు కిందికి దిగివచ్చాడు. దీంతో గ్రామస్తుల ఊపిరిపీల్చుకున్నారు.