- నగరంలో ఘనంగా మిలాద్ ఉన్ నబి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : మానవ శ్రేయస్సు కోసం మహమ్మద్ ప్రవక్త ఎన్నో బోధనలు చేశారని, ఈ బోధనలు అనుసరించి సమాజం సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉంటుందని మత పెద్దలు మిలాద్ అధ్యక్షులు షోహెబ్ రజా, కన్వీనర్ రషీద్ రజా, షాహైద్ రజా అన్నారు. మిలాద్-ఉన్-నబి వేడుకలను ముస్లింలు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డు అహ్మద్ పూర కాలనీ, బర్కత్ పుర, మాలపల్లి, కంటేశ్వర్, ఎల్లమ్మగుట్ట, వినాయక నగర్ తదితర ప్రాంతాల్లోని మసీద్ లో ముస్లింలు ప్రార్ధనలు చేశారు. ప్రపంచ శాంతి సందేశాన్నిఅందించిన మహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకలను ఘనంగా ముస్లింలు జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త గొప్ప సంస్కర్త అని, ప్రవక్త బోధనలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయన్నారు. మానవ సమాజ సమస్యలకు సవాల్ అన్నింటికి ఆయన పరిష్కారం చూపారని పేర్కొన్నారు. మన సమాజంలోని వివిధ రంగాల్లో ఆయన మార్గదర్శకం చూపారని మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశలలో వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏదీ జీవితం ఏది హితం కాదు తెలియజేశారు అన్నారు. మహమ్మద్ ప్రవక్త తన 23ఏళ్ల దైవ దౌత్య కాలంలో సాధించిన అపూర్వ విజయం సౌకర్యాలను ముస్లింలు గుర్తు చేసుకున్నారు. ప్రపంచ మానవాళికి మహమ్మదు ప్రవక్త ఆదర్శప్రాయం అని అన్నారు. నేటి పరిస్థితుల దృష్ట్యా మహమ్మద్ ప్రవక్త బోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు మాలపల్లి, ఆటో నగర్, అహ్మది బజార్ తదితర ప్రాంతాల నుంచి ర్యాలీగా బయలుదేరి నెహ్రూ పార్క్ మసీద్ కు చేరుకున్నారు. మత పెద్ద మహమ్మద్ ప్రవక్త గురించి సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత పెద్ధలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
