Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 5:01 pm Posted by : ramakrishna

తె.యూ ఆర్ట్స్ కళాశాలలో ప్రొఫెసర్ జయంతి వేడుకలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం (తె.యూ.) ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణాచారి, సీనియర్ ప్రొఫెసర్ కనకయ్య, విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) డాక్టర్ కె.వి. రమణాచారి, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన నిరంతర పోరాటం, త్యాగం, అంకితభావం చిరస్మరణీయమని కొనియాడారు. విద్యావేత్తగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా ఆయన సమాజంలో చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు, ఆలోచనలు, విలువలను తెలుసుకొని వాటిని జీవితంలో ఆచరించాలని వక్తలు సూచించారు. విద్య, సామాజిక బాధ్యత, ప్రాంత అభివృద్ధి పట్ల ఆయన చూపిన నిబద్ధతను ఆదర్శంగా తీసుకొని సమాజ పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌కు ఘన నివాళులు అర్పించారు.