. . . మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య
బాన్సువాడ బతుకమ్మ :
అప్పుల భారం, ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం బస్వాయిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విఠల్ (28)ఇంటి నిర్మాణం కోసం రెండు ఫైనాన్స్ కంపెనీల్లో రుణాలు తీసుకున్నాడు. రుణాలకు సంబంధించిన ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ నెల 22న ఓ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇంటిని సీజ్ చేశారు. దాంతో ఇంటిని ఖాళీ చేసి సమీపంలో తల్లిగారింట్లో ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకునే విఠల్ ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థలు ఇంటిని సీజ్ చేయడాన్ని అవమానంగా భావించాడు. ఈ నెల 28న పొలానికి వెళ్తున్నానని ఇంటికి తిరిగిరాలేదు. ఆదివారం ఉదయం స్థానికంగా పొలం వద్ద వెతికినా కనిపించకపోవడంతో ఫోన్ చేస్తే రింగ్ టోన్ సీజ్ చేసిన ఇంటి నుంచే వస్తుండడంతో అక్కడికి వెళ్లి చూడగా సీలింగ్ కు విఠల్ ఉరి వేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి భార్య అనురాధా ఫిర్యాదు చేయడంతో నస్రుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.