- అల్లాడుతున్న జనం..
రుద్రూర్, బతుకమ్మ: ఓ వైపు రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ మరోవైపు కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క రోజులోనే దాదాపు 05 నుంచి 10 సార్లు విద్యుత్ ట్రిప్.. ఇక గాలి దుమారం వచ్చిందంటే ఎక్కడో ఒక చోట అంతరాయం.. గంటల తరబడి వేచి చూస్తే కానీ పునరుద్ధరణ కానీ పరిస్థితులు.. పలుచోట్ల తరచుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు. అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. రుద్రూర్ గ్రామంలో గత నెల రోజుల నుండి విద్యుత్ కోతలు విధిస్తుండడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల సాగు మొదలుకాక ముందే కరెంటు కోతలు ఏమిటంటూ జనం ప్రశ్నిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడం, గంటల పాటు విద్యుత్ అధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోకపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. బ్యాంకు, పోస్టాఫీస్, మీసేవ కేంద్రాలకు వచ్చే వారు కరెంట్ కోతలతో పనులు సాగక గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యుత్ కోతలపై ట్రాన్స్కో అధికారులకు చరవాణిలో సంప్రదించగా స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రత్యేక విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ కోరుతున్నారు.