సంఘ అద్యక్షుడు ఉమ్మెడ నారాయణ
ఇందూర్, బతుకమ్మ: గ్రామ దేవతలకు పూజలు చేసే పోతరాజులకు వేరుగా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ద్యావతి సంఘం అద్యక్షుడు ఉమ్మెడ నారాయణ డిమాండ్ చేసారు. నిజామాబాద్ జిల్లాకు గురువారం వచ్చిన ఏక సభ్య ఎస్సి కమిషన్ జస్టిస్ శమిం అక్తర్ కు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల కులంలో ఉన్న పోతరాజులకు దీని ఆధారంగానే కుల ధృవీకరణ పత్రాలను మండల రెవిన్యూ కార్యాలయాల నుంచి ఇప్పించాలన్నారు. గ్రామాలలో ఉన్న పోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ, మహలక్ష్మి, ఎల్లమ్మ తదితర దేవతలకు శూద్ర బ్రాహ్మణులుగా పిలవబడే వారిని పోతరాజు ఉప కులంలో చేర్చాలని కోరారు. పోతరాజులు, పంబాల, బైండ్ల, ఆసది, కొలుపులవారు, ద్యావతి అని ప్రాంతాల వారిగా ఈ వృత్తిలో ఉన్నవారిని పిలుస్తుంటారని చెప్పారు. ఏక సభ్య వర్గీకరణ కమీషన్ స్పందించి పోతరాజులను ఎస్సి-ఏ లో చేర్చి పోతరాజు ఉపకులంగా ధృవీకరణ పత్రాలను రెవిన్యూ నుంచి ఇప్పించాలని కోరారు. సంఘ అధ్యక్షుని వెంట పతేపూర్ గంగాధర్, వేల్పూర్ పురుషోత్తం, బాల్కొండ మురళి ఉన్నారు.
