నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్ లైన్ కేంద్రంలో జూన్ 16న పాలిసెట్ చివరి విడత ధృవ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రాజ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ డిప్లొమా ప్రవేశాల కోసం అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు జూన్ 15 లోపు tgpolycet.nic.in వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు జూన్ 16న తమకు కేటాయించిన సమయానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కేంద్రానికి హాజరు కావాలన్నారు. ధృవ పత్రాల పరిశీలన పూర్తైన అనంతరం జూన్ 17 లోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి విభాగంలో 60 సీట్లు చొప్పున ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలతో పాటు ఉన్నత విద్య, స్వయం ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా ఉన్నాయని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులు సకాలంలో కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన కోరారు.
