న్యూ ఢిల్లీ, బతుకమ్మ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 11గంటల వరకు 19.95శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ర్టపతి ద్రౌపతి ముర్ము, విదేశాంగ మంత్రి జయశంకర్, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతీశీ, ప్రియాంకాగాంధీ వంటి ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 13,776 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకే దశలో పోలింగ్ జరుగుతుండగా, 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉద్యోగులకు వేతనం కూడిన సెలవును ప్రకటించారు. అలాగే ఉత్తర్ ప్రదేశ్, హర్యానా రాష్ర్టాలు సైతం వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 62.59శాతం ఓట్లు పోల్ కాగా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 56శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది.
