Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 6:25 pm Posted by : ramakrishna

పంద్రాగస్టు వేడుకకు ముస్తాబైన పోలీస్ పరేడ్ గ్రౌండ్

 

. . . ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, శనివారం ఉదయం 9.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపధ్యంలో పరేడ్ గ్రౌండ్ లో పంద్రాగస్టు వేడుకకు చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేదిక, బారికేడింగ్, సీటింగ్ అరేంజ్ మెంట్,  పబ్లిక్ అడ్రస్ సిస్టం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లు తదితర వాటిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, యువత విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన ఆకట్టుకునే రీతిలో ఉండాలని అన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు కలెక్టరేట్ లో జరిగే పంద్రాగస్టు వేడుకలో పాల్గొని, పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే వేడుకకు సైతం హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి బి.గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

 

Police Parade Ground decked up for the Independence Day celebrations.