కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి పాత బస్టాండ్లో శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేసవి కాలంలో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాలపై అవగాహన, హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యత, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా సైబర్ మోసాలకు గురికాకుండా ఓటిపిలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. సైబర్ నేరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1930ను, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, షీ టీమ్ టోల్ ఫ్రీ నంబర్ 8712686094కు సంప్రదించాలని తెలియజేశారు. అలాగే చిన్నపిల్లలు వేసవి సెలవుల సందర్భంగా ఈతలకు వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, పోలీస్ కానిస్టేబుల్స్ ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి షీ టీమ్ సభ్యులు డబ్య్లూపీసీ సౌజన్య, పీసీ భూమయ్యతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పాల్గొన్నారు.
