ఇందల్వాయి, బతుకమ్మ: తన దుకాణం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వ్యక్తినే పోలీసులు చితకబాదారు. ఈ ఘటన ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కుమ్మరి సాయిలు అనే వ్యక్తి తన పాన్ షాపు ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవిస్తున్నారని డయల్ 100కు ఫిర్యాదుచేశాడు. ఆ తరువాత తాను ఫిర్యాదు చేసిన కేసు ఎందుకు నమోదు చేయడం లేదని పోలీసులను సాయిలు ప్రశ్నించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన పోలీసులు అతడిని ఇష్టం వచ్చినట్లుగా చితకబాదారు. అంతకు ముందు ఫిర్యాదుదారుడి ఇంటి వద్దకు సివిల్ డ్రెస్ పై వెళ్లిన ఎస్సై ఫోన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, బూతులు తిడుతూ వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఫిర్యాదుదారులను ఇలా బెదిరిస్తూ దాడులకు పాల్పడితే సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడుతారని, సాయిలును కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
