Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 2:33 pm Posted by : ramakrishna

పచ్చబొట్టు కవితా సంకలనం ఆవిష్కరణ

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రానికి చెందిన కవులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, ఘనపురం దేవేందర్, జి నరసింహస్వామి, తిరుమల శ్రీనివాస్ ఆర్య, నరాల సుధాకర్ కలిసి రచించిన ‘పచ్చబొట్టు’ కవితా సంకలనాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెలంగాణ రచయితల సంఘం పదేండ్ల సాహిత్య సభలో కవితా సంకలనాన్ని ఆవిష్కరించి సిధారెడ్డి నిజామాబాద్ జిల్లాలో బలమైన సాహిత్య వాతావరణం ఉందని అభినందించారు. నిజామాబాద్ కవులు రూపొందించిన పచ్చబొట్టు కవితా సంకలనం స్ఫూర్తిగా తీసుకొని ఇతర జిల్లాలలో కూడా కవితా సంకలనాలను తీసుకురావాలని తెలంగాణ రచయితల సంఘం సభ్యులకు సూచించారు. తెలంగాణలో వస్తున్న చిక్కని చక్కని కవిత్వానికి పచ్చబొట్టు కవితా సంకలనం నిదర్శనమని కొనియాడారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ పచ్చబొట్టు కవితా సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించారు.  జనగామ జిల్లా తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు బిల్లా మహేందర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి నేటి నిజం సంపాదకులు బైస దేవీదాస్, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్,  ఎం .కవిత, జి డి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.