ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆహ్వానం మేరకు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ శెట్కార్, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి శనివారం పోచారం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రాజెక్టు యొక్క విశిష్టతను మంత్రికి వివరించారు. పోచారం ప్రాజెక్ట్ నందు మంత్రి, ఎంపీ సురేష్ శెట్కార్, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ అందరు కలిసి బోట్ రైడ్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అద్భుతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఎత్తైన ప్రదేశంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం వల్ల పర్యాటకులను ఆకర్షిస్తుందని అన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో టూరిజం పాలసీని ప్రవేశ పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
