హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీ కట్టిన మహిళ పోలీసులు
కామారెడ్డి, బతుకమ్మ :
రాఖీ పండుగను పురస్కరించుకుని కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి మహిళ పోలీసులు ప్రేమతో రాఖీ కట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కామారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్, మహిళా ట్రాఫిక్ సిబ్బంది పోలీస్ స్టేషన్ ఎదుట వాహనదారులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు బొట్టు పెట్టి రాఖీ కట్టి, మీ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సందేశం ఇచ్చారు. జరిమానాల కంటే అవగాహనతో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం వాహనదారులను ఆకట్టుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం ప్రతి ద్విచక్ర వాహనదారుడి బాధ్యత అని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినయ్ సాగర్తో పాటు మహిళా ట్రాఫిక్ సిబ్బంది శోభ, స్వప్న, అనిత, మూసిన్ ఖాన్, తిరుపతి, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.