. . . ఆర్టీసీ డిఎంకు వినతిపత్రం ఇచ్చిన భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి లింగంపల్లి గ్రామాల వద్ద బస్సులు ఆపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తో కలిసి మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు సోమవారం కామారెడ్డి డిపో మేనేజర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గాంధారి – లింగంపల్లి – భూంపల్లి – కామారెడ్డి వరకు ఆర్టిసి బస్సు నడపాలని ఆర్టీసీ డిఎం ని కోరారు. ఆయన స్థానికంగా స్పందించి గాంధారి నుండి లింగంపల్లి భూంపల్లి కామారెడ్డి వరకు ఆర్టీసీ బస్సు నడిచే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు. ఫ్రీ బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత కామారెడ్డి బాన్సువాడ మధ్యలో ఎక్స్ ప్రెస్ బస్సులు ఎక్కువగా నడపడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్డినరీ బస్సులు నడిపి భూంపల్లి, లింగంపల్లి, జనగాం, గ్రామాల ప్రజలకు అటు బాన్సువాడ ఇటు కామారెడ్డికి ప్రయాణికులు వెళ్లడానికి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి నుండి బాన్సువాడ కు గతంలో 10 ఆర్డినరీ బస్సులు నడిచేయని ప్రస్తుతం నాలుగు మాత్రమే నడుపుతూ మిగతా ఎక్స్ప్రెస్ బస్సులు నడిపి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని డిఎం దృష్టికి తెచ్చారు. కొత్త బస్సులు వస్తే ఆ రూట్ లో ఆర్డినరీ బస్సు సౌకర్యం కల్పిస్తామని డిపో మేనేజర్ దినేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో విట్టల్ రావు, దత్తురావు, కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.