కామారెడ్డి, బతుకమ్మ : విధి నిర్వహణలో ఉండి తక్షణమే స్పందించి మగ శిశువును సంరక్షించిన పెట్రో కార్, బ్లూ కోర్ట్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభింనందించారు. సోమవారం కామారెడ్డి పట్టణంలో గల వీక్లీ మార్కెట్ సమీపంలో కొందరు వ్యక్తులు ఏదో విషయనికై గొడవ పడుతున్నారని సమాచారం వచ్చింది. పట్టణ పోలీస్ స్టేషన్లో పెట్రో కార్ లో డ్యూటీ చేస్తున్న ఏఎస్ఐ రంగారావు, పిసి వెంకటేష్, సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ చేశారు. వారిలో ఒకరికి పుట్టిన మగ శిశువు వేరే వారికి అమ్మగా వచ్చిన డబ్బుల విషయంలో గొడవ జరుగుతుందని తెలుసుకొని, వెంటనే ఈ విషయాన్ని పై అధికారులకు తెలిపారు. కామారెడ్డి డిసిపిఓ కామారెడ్డి కు తెలుపగా వచ్చి విచారణ చేశారు. విచారణలో భాగంగా క్యాసం పల్లి గ్రామానికి చెందిన పల్లపు రాజమణి, నర్సింలు అనే వారికి పుట్టిన మగ బిడ్డను ఈ నెల 19న మధ్యవర్తులు అయిన పిట్ల వెంకటి, రాములు సమక్షంలో 55 వేల రూపాయలకు సిరికొండ మండలం లోని ఒక గ్రామానికి చెందిన భార్యాభర్తలకు అమ్మినారని తెలుసుకొగా, వెంటనే ఈ విషయంలో కామారెడ్డి పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ చేసి పుట్టిన బాబు ను అక్రమంగా కొనుగోలు చేసిన వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. డిసిపిఓ కు తదుపరి చర్యల నిమిత్తమై అప్పగించారు. అంతేగాక చిన్న బాబును అమ్మిన వారిపై, మధ్యవర్తులపై, పుట్టిన బాబు ను కొన్నవారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించి, పుట్టిన బాబు ను సంరక్షించిన ఏఎస్ఐ రంగారావు, కానిస్టేబుల్ వెంకటేష్, హోం గార్డ్ బాలరాజ్ మరియు ఏ.ఆర్.పి.సి. లక్ష్మణ్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పట్టణంలో, జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ పార్టీలు, బ్లూ కోర్ట్ పార్టీలు 24/7 డ్యూటిలు నిర్వహిసున్నారు అని తెలిపారు. ఎవరైనా చిన్న పిల్లల అమ్మడం కాని కొనడం కాని సమాచారాని తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.