Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 3:24 pm Posted by : ramakrishna

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • ప్రజావాణికి 123 ఫిర్యాదులు

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్ లకు అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  • అంతర్జాతీయ యోగా దినోత్సవం పోస్టర్లు ఆవిష్కరణ..

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన గోడ ప్రతులు, కరపత్రాలను కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ నెల 21న ఉదయం 6.55 గంటల నుండి 8.30 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్డులో గల శ్రీరామ గార్డెన్స్ లో సామూహిక యోగ సాధన ప్రదర్శన ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని యువజన సంఘాలు, మహిళా మండళ్లు, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు, క్రీడాకారులు, అన్ని వర్గాల వారు సామూహిక యోగ సాధనలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా ఆయుష్ విభాగం నోడల్ అధికారి డాక్టర్ జె. గంగాదాసు, వైద్యులు తిరుపతి, వెంకటేష్, డీపీఎం వందన, ఫార్మసిస్ట్ ఎన్.పురుషోత్తం, భిక్షపతి, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.