ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలో శుక్రవారం మొహరం ని పురస్కరించుకొని పీర్ల పండగను ఘనంగా నిర్వహించారు. పీర్ల పండుగకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, పూనకలతో ఊగిపోయారు. అసైదుల హారతి పీర్ల పండగ గమ్మతి అంటూ అగ్నిగుండం చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. ముస్లింల నమ్మకం ప్రకారం మహమ్మద్ ప్రవక్త మనవడైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యుల త్యాగాలను, కర్బలా యుద్ధంలో వారు చేసిన వీరమరణాన్ని స్మరిస్తూ ముస్లింలు జరుపుకునే పవిత్ర సంతాప పర్వదినం పీర్ల పండగ. ఇది తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో కులమతాలకు అతీతంగా, హిందూ-ముస్లింల మతసామరస్యానికి ప్రతీకగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇమామ్ హుస్సేన్ అమరత్వానికి ప్రతీకగా ఇత్తడి లేదా ఇతర లోహాలతో చేసిన ‘పీర్లను’ (ఆలమ్లను) అత్యంత పవిత్రంగా పూజిస్తారు. పది రోజుల పాటు అషుర్ఖానాలలో ఉంచి వీటిని ఘనంగా ఊరేగింపుగా తీసుకెళతారు. ముస్లింలతో పాటు హిందువులు కూడా భక్తిశ్రద్ధలతో పీర్లకు మొక్కుకుంటారు. కోరిన కోరికలు తీరుతాయని నమ్మి నైవేద్యాలు సమర్పించుకుంటారు. పీర్ల ఊరేగింపు సమయంలో డప్పు వాయిద్యాలు, కత్తిసాము, పులి వేషాలు వంటి జానపద కళారూపాలతో గ్రామీణ ప్రాంతాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రాంతాలలో భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి నిప్పుల గుండం (అగ్నిగుండం) తొక్కడం లేదా ప్రత్యేక ప్రార్థనలు చేయడం చేస్తారు. పండుగ చివరి రోజున (అషురా) పీర్లను బాజాభజంత్రీలతో ఊరేగించి సమీపంలోని నది, బావి లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు.