బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని 16వ వార్డు మహాలక్ష్మి ట్రస్ట్, పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది. అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా శుక్రవారం మహాలక్ష్మి మందిరం నుండి ఆలయం వరకు అమ్మవారి విగ్రహాన్ని పురవీధుల గుండా ఘనంగా ఊరేగించారు. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు పూర్ణకలశాలు, మంగళహారతులతో, మేళతాళాలతో ఊరేగింపు సాగించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో వేద పండితులు విశేష పూజలను ప్రారంభించారు. శనివారం హోమం, ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన, శిఖర స్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాల అనంతరం అన్నదానం ఉంటుందని వెల్లడించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలంటూ కమిటీ విజ్ఞప్తి చేసింది.
