హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటుగణ నాథుడికి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహాకులు, క్రేన్ ఆపరేటర్లు అందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్బండ్తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.