Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 5:19 pm Posted by : ramakrishna

పిడిఎఫ్ బియ్యం లారీ పట్టివేత

బిచ్కుంద, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రైస్ మిల్లుల యజమానులు తమకు కేటాయించిన ధాన్యాన్ని  పక్కదారి పట్టించి ఆ స్థానంలో పిడిఎఫ్ బియ్యం ప్రభుత్వానికి అంటగట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. మరి కొంతమంది పేదలకు దక్కవలసిన పిడిఎఫ్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తుంటే సంబంధిత శాఖ అధికారులు నెలనెలా ముడుపులు అందుకుంటూ మాఫియాకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే కోటగిరి, పొతంగల్, మద్నూర్, వర్ని, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో పిడిఎఫ్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. వీరికి సంబంధిత శాఖ అధికారుల అండదండలు ఉండడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. పేదల వద్ద నుంచి తక్కువ ధరకు బియ్యంని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పిడిఎఫ్ బియ్యం పట్టుకున్న ఘటనలు వెలుగు చూసాయి. తాజాగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఫతిలాపూర్ ప్రధాన రహదారిపై అక్రమంగా పిడిఎఫ్ బియ్యం తరలిస్తున్న లారీని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యం లారీ విషయం పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు అందుబాటులో లేకపోవడంతో బియ్యం లారీని పోలీస్ స్టేషన్లో పెట్టారు. పౌర సరఫరాల శాఖ అధికారులు వచ్చి బియ్యం ఎక్కడినుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అన్న దాని విషయంపై విచారణ చేపట్టనున్నారు. పట్టుబడ్డ బియ్యం సుమారుగా 500 క్వింటాలకు పైగా ఉంటాయని తెలుస్తుంది. పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణలో అసలు విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.

Pdf rice lorry tracking