- నత్తకు నడక నేర్పుతున్న నర్సరీలు
బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం కోసం నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామా పంచాయితీలలో నర్సరీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 4.24 లక్షల మొక్కలు నర్సరీలో పెంచి నాటాలని లక్ష్యం ఉంది. ఇందుకు కావలసిన మొక్కల ప్యాకెట్లు, ఎర్ర మన్ను , మొక్కల విత్తనాలు తదితర కావలసిన సామాగ్రిని స్థానిక గ్రామపంచాయతీ నుంచి సమకూర్చడం జరుగుతుంది. కానీ వాటిని నిర్వహణ బాధ్యత ఉపాధి హామీ సిబ్బందికి అప్పగించారు. క్షేత్ర స్థాయిలో నర్సరీల నిర్వహణ నత్తకు నడక నేర్పుతున్న విధంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మోర్తాడ్ మండలంలోని ఒక గ్రామంలో గల నర్సరీలో విత్తనాలు ఆరబోశారా..? పారబోశారా..? అన్నట్లుగా విత్తనాలు కనిపిస్తున్నాయి. కొన్ని నర్సరీలో సగం వరకు కూడా ఇప్పటివరకు సీడ్ పెట్టకుండా ఖాళీ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి.

ప్రతి గ్రామపంచాయతీలో గల నర్సరీకి 8 వేల మొక్కలు పెంచాలని లక్ష్యం ఉంది. కానీ ఇప్పటివరకు కొన్ని నర్సరీలో 2000 – 3000 వరకు మాత్రమే మొక్కల ఫీడింగ్ జరిగిందని, కొన్ని నర్సరీలో గుంతలు తోడి అసంపూర్తిగా పనులు ఉండిపోయినాయి. కొన్ని నర్సరీలో కేవలం ఈత నారు మాత్రమే తీసుకువచ్చి ప్యాకెట్లలో నాటినారు. దీంతో నర్సరీలు నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ తూతూ మంత్రంగా కాకుండా నర్సరీల పర్యవేక్షణ చేసి నర్సరీలో మొక్కల పెంపకాన్ని నిర్లక్ష్యం వయించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
