నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో పథ సంచలన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. స్వయం సేవకులతో కలిసి పట్టణంలోని పలు కాలనీల మీదుగా సాగిన పథ సంచలన్లో నడిచి, దేశభక్తి నినాదాలతో ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ దేశ సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రతి విపత్తు సమయంలో సహజమైనా, సామాజికమైనా స్వయంసేవకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారన్నారు. సమాజ నిర్మాణంలో, సాంస్కృతిక విలువల పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ అత్యంత ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. పథ సంచలన్లో పెద్ద సంఖ్యలో స్వయంసేవకులు పట్టణ వీధుల్లో క్రమశిక్షణతో ప్రదర్శన నిర్వహించారు. దేశభక్తి గీతాలు, నినాదాలతో నగరం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ నగర స్వయంసేవకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
