Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 4:48 pm Posted by : ramakrishna

నీట్ పేపర్ లీకేజీపై ఆగ్రహం 

 

. . . భిక్కనూరులో కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ భారీ ఆందోళన

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

నీట్ పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్కనూరు మండల కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల నుంచి భిక్కనూరు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.అనంతరం భిక్కనూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. చివరగా చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల దిష్టిబొమ్మలను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంథాలయసంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని అన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, సీనియర్ నాయకుడు భీమ్ రెడ్డి, సర్పంచ్ బల్యాల రేఖ, సొసైటీ చైర్మన్ భూమయ్య తదితరులు ఉన్నారు.