. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సిద్దిపేట, బతుకమ్మ :
రైతును రాజుగా నిలబెట్టే ప్రతి పథకాన్ని తెలంగాణ రైతాంగానికి చేరువ చేస్తూ, వ్యవసాయ రంగంలో రైతులకు మన ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన రైతు ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన, రూ.775.72 కోట్లతో జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం ప్రజా పాలన రైతు ఉత్సవాలు వేదికగా రూ.3600 కోట్లు మొదటి విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వాణిజ్య పంటలను ప్రోత్సహించే దిశగా ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో అద్భుతమైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు రిఫైనరీనీ యూనిట్ ని ప్రారంభించామని అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు నర్మెటలో కట్టిన ఫ్యాక్టరీ తమ హయాంలో కట్టినదిగా చెప్పుకుంటున్నారని, వారి హయాంలో కేవలం తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక జీవోను విడుదల చేశారన్నారు. రాజకీయాలకతీతంగా, ప్రాంతాలకతీంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ రోజు రైతులకు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పక్ష నేతలు ఎన్ని విషప్రచారాలు చేసినా, ఆరోపణలను గుప్పించినా ప్రజాప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని, త్వరలోనే సాదా బైనామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ప్రతీ పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని, ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పింక్ చొక్కా తొడుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా సరే అర్హుడైన పేదవారైతే చాలు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని, ఇది ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధి అని సీఎం తెలిపారు.

. . . విద్యార్థుల తల్లి దండ్రులు ప్రైవేటు మోజులో పడవద్దు
రాష్ట్రంలో అత్యుత్తమ శిక్షణ పొందిన టీచర్లు లక్షకు పైగా పనిచేస్తున్నారని, 18 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకున్నామని సీఎం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రారంభించడమే కాకుండా విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ప్రైవేటు కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి టీచర్లు ఉన్నారని, ప్రైవేటు మోజులో పడకుండా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదని, కానీ ఏటీసీల్లో చదువుకుంటే ఉద్యోగం కల్పించే బాధ్యత నాదని, సాంకేతిక నైపుణ్యం ఉండాలని సీఎం అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతి నెల 2 వేల రూపాయల చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వబోతున్నామని, విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడాలని, ట్యాలెంట్ ఉంటే ప్రపంచం మనముందు తలవంచుకుని నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘునందన్ రావు తో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
