నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన కేసులో కర్రెమొల్ల సురేష్ కు రెండు సంవత్సరాల సాదారణ జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ రెండవ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) పమూజుల శ్రీనివాస్ రావు మంగళవారం తీర్పు వెలువరించారు.వివరాలు నిజామాబాద్ రైల్వేస్టేషన్ కార్యాలయంలో గ్యాంగ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న శేక్ అహ్మద్ హుస్సేన్ తనరోజు పనిలో భాగంగా 28 జనవరి,2016 న నగర శివారులో గల ఇందూర్ కేన్సర్ ఆసుపత్రికి దగ్గరలో రైల్వే ట్రాక్ పై జెండా పాతి పనిచేస్తున్నాడు.ఇతనికి దూరంగా మరొక గ్యాంగ్ మెన్ సురేష్ పనిచేస్తూ తనకు జెండా అవసరం ఉన్నదని,కావాలని బలవంతం చేయసాగాడు. ఒకటే జెండా ఉన్నదని అది పనిలో భాగంగా రైల్వే ట్రాక్ పై పాతి ఉంచానని తెలిపారు. ఎంత చెప్పిన వినని సురేష్ భూతు మాటలు తిడుతు బెదిరించాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని పని చేసుకొనివ్వమని హుస్సేన్ కోరాడు. తన దగ్గర ఉన్న ఐరన్ సుత్తె తో హుస్సేన్ ముఖంపై బలంగా కొట్టి తీవ్రంగా గాయపరచాడు. కోర్టు నేర న్యాయవిచారణలో ముద్దాయి సురేష్ పై నేర అభియోగాలు నిరూపితం అయినందున ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 326 నేరంకు గాను రెండు సంవత్సరాల సాధారణ జైలుశిక్ష తో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు రోజుల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి శ్రీనివాసరావు తమ తీర్పులో పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ పొలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.