Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 6:54 pm Posted by : ramakrishna

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 

. . . సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సీజనల్ వ్యాధుల నివారణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, విష జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం జిల్లాలోని పలు ప్రాంతాలలో డెంగ్యూ వ్యాధితో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని, ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ కూడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, మంచి నీరు కలుషితం కాకుండా పైప్ లైన్ లీకేజీలను అరికట్టాలని, నివాస ప్రాంతాల నడుమ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం ఉండకూడదని సూచించారు. మురుగునీటి కాల్వలను క్రమం తప్పకుండా శుభ్రపర్చేలా చర్యలు తీసుకోవాలని, నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఇంటిని ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తప్పనిసరిగా సందర్శిస్తూ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలని, ప్రతి నివాస ప్రాంతంలో ఫ్రైడే – డ్రై డే పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. అస్తవ్యస్థ పరిస్థితుల కారణంగా ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలితే, సంబంధిత అధికారులు, సిబ్బందిని బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓపెన్ ప్లాట్లలో వర్షపు, ముగురు జలాలు నిలువ ఉండకూడదని, చెత్తా చెదారం వేయకుండా చూడాలన్నారు. ఈ విషయాలపై జాగ్రత్తలు తీసుకోని ప్లాట్ల యజమానులకు అవసరమైతే జరిమానాలు విధించాలని మున్సిపల్, పంచాయతీ అధికారులకు సూచించారు. విష జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే అవసరమైన చికిత్సలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది అన్నివిధాలుగా సన్నద్ధమై ఉండాలని, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పారిశుధ్య పనులు పక్కాగా జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. దోమల నివారణ మందులను గ్రామ పంచాయితీలలో అందుబాటులో ఉంచుకోవాలని, వారానికి కనీసం రెండు పర్యాయాలు తప్పనిసరిగా పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్యా అన్ని పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ బడులలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని, పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్న హైరిస్క్ ఏరియాలలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజలు సీజనల్ వ్యాధులకు గురి కాకుండా చూడాలని హితవు పలికారు. అనంతరం పొగాకు నియంత్రణపై నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పొగాకు వాడకం వల్ల కలిగే అనర్ధాల గురించి విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు. పొగాకు విక్రయాలకు సంబంధించి నిబంధనలు పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమావేశాలలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ పి.సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

One must remain vigilant against seasonal diseases.