ఇందల్వాయి, బతుకమ్మ : మండలంలోని తిర్మన్ పల్లి గ్రామ శివారులో శిలా ఫలకం గద్దెను ధ్వంసం చేసి శిలాఫలకాన్ని దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఇందల్వాయి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తిర్మన్ పల్లి గ్రామ శివారులో ప్రభుత్వం నూతనంగా నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. ఈసబ్ స్టేషన్ భూమిలోకి గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి శిలాఫలకం గద్దెను ధ్వంసం చేసి శిలాఫలకాన్ని ఎత్తుకె ళ్లారని విద్యుత్ శాఖ ఏఏఈ బొల్లు పాండరినాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిర్మన్ పల్లి గ్రామస్తుడు మేకల క్రాంతిని నిందితుడిగా దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఇందల్వాయి పోలీసులు ఈసందర్భంగా హెచ్చరించారు.