Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 4:40 pm Posted by : ramakrishna

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

 

. . . పనుల్లో నాణ్యత తో పాటు వేగం అవసరం

 

. . . ప్రజారోగ్య శాఖ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా భేటీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలో కొనసాగుతున్న యూజీడి, వాటర్ వర్క్స్, ఇంటింటికి నల్లా కనెక్షన్లు తదితర పనులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులో వేగం పెంచాలని సూచించారు. అలాగే ఇంటి నుంచి డ్రైనేజీకి అనుసంధానం చేసే పైప్ లైన్ పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. పనిచేసే బృందాల సంఖ్యను పెంచాలని, పనులను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో మొత్తం 91 కిలోమీటర్ల యూజిడి పనులు మంజూరైతే ఇప్పటివరకు సుమారు 30 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మరింత వేగంగా పనులు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే అమృత్ 2 పథకం కింద 19 వాటర్ ట్యాంక్ లు మంజూరయ్యాయన్నారు. ఇందులో పలు ట్యాంక్ లు ఆయా దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక అర్సపల్లి సమీపంలోని రామర్తి చెరువు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.  ప్రతి పనిపై అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల్లో పురోగతి వేగంగా సాధించాలని తెలిపారు. పలుచోట్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, వాటిపై ప్రత్యేకంగా దృష్టి సాధించాలని పేర్కొన్నారు. తొందర్లోనే తాను పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తానని అధికారులతో చెప్పారు. సమావేశంలో ప్రజారోగ్య శాఖ డీఈ నగేష్, ఏఈ లు వీణ, శివకృష్ణ, శంకర్ పాల్గొన్నారు.

 

Officials should visit the field