Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2024, 2:42 pm Posted by : ramakrishna

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 . గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి

. ఎస్సారెస్పీలో నీటి మట్టం 5టీఎంసీలు తక్కువగా ఉండేలా చూడండి

. వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున కరెంట్ కోతలు ఉండవు

. మాజీ మంత్రి , భోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి

బతుకమ్మ, మెండోరా: భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగాఉండాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్షన్ రెడ్డి సూచించారు. ఎస్సారెస్పీని మంగళవారం ఆయన సందర్శించారు. ప్రాజెక్టు గేట్లను, జెన్ కో పవర్ జనరేషన్ ప్రాజక్ట్ ను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ లోకి భారీ ఇన్ ఫ్లో వస్తున్నందున నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మున్ముందు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు నీటి మట్టం 5 నుంచి 8 టీఎంసీలు తక్కువగా ఉండే విధంగా చూడాలని సూచించారు. అవసరమైతే వర్షకాలం చివరన మళ్లీ ప్రాజెక్ట్ ను నింపుకోవచ్చన్నారు. భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ పవర్ జనరేషన్ విభాగంలో విరివిగా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నందున ఇక కరెంట్ కోతలు ఉండవని ఎమ్మెల్యే అన్నారు. వరద కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు సూచించారు.  కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు నగేశ్  రెడ్డి, అరికెల నర్సారెడ్డి, గడుగు గంగధర్, ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్  నాయకులు తదితరులు పాల్గొన్నారు.