Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 6:17 pm Posted by : ramakrishna

కార్మికవర్గ ఐక్య పోరాటాలకు కేరాఫ్ నూర్జహాన్

 

. . .  సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

 

సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అతిచిన్న వయసులోనే పోరాటంలో పరుగులు పెడుతూ అభాగ్యులకు,దోపిడీకి గురవుతున్న వారికి అండగా నిలిచిన ధ్రువతార దూరమైందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు… . సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఈ నెల 11 తన అనారోగ్య సమస్యతో మృతిచెందగా.. యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళి అర్పించారు. సీఐటీయూతో పాటు ప్రజా సంఘాల నాయకులు,వివిధ రంగాల కార్మికులు హాజరై నివాళి అర్పించారు. ఈ సంస్మరణ సభకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ అధ్యక్షత వహించగా.. ముందుగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. భౌతికంగా ఆమె లేకపోవడం ఇటు సీఐటీయూకు ఆటు ఆమె కుటుంబానికి తీవ్ర లోటు అని అన్నారు. ఆటంకాలు,ఒడిదుడుకులు ఎదురైనా పోరాటాలు ఆపకుండా ముందుకువెళ్లి నిలుచున్నారని,పోరాటం చేపడితే ఫలితం వచ్చే వరకూ పోరాటం చేసిన ధైర్యశీలీ,దీశాలని అని కొనియాడారు. నూర్జహాన్ అంటే ధైర్యం అని, అదే పాత్ర జిల్లా నాయకత్వం పోషించాలని,ఒక్కో కార్మికుడు ఒక్కో నూర్జహాన్ గా మారి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీకి సహకారం అందిస్తుందని తెలిపారు.

 

కార్మిక ఐక్య ఉద్యమాలు నిర్వర్తించే నూర్జహాన్ కీలక సమయంలో మన నుంచి దూరమైంది…..

 

. . . సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య

 

Nur Jahan's contribution to the united struggles of the working class

 

ఒక వైపు ధరల పెరుగుదల,మరో వైపు కార్మిక చట్టాల రద్దుతో కార్మికులపై నిరంకుశత్వంగా కేంద్రం వ్యవహరిస్తుందని,దీనికి తోడు మతం పేరుతో వైశమ్యాలు పెంచుతూ కార్మికుల ఐక్యతను విడగొడుతున్నారని ఇలాంటి సమయంలో కార్మిక ఐక్య ఉద్యమాలు నిర్వర్తించే నూర్జహాన్ కీలక సమయంలో మన నుంచి దూరమయ్యారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య అన్నారు. ఒక వైపు అమెరికా సామ్రాజ్యవాదంతో యుద్ధాలు చేస్తుండటంతో మన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయని,దీంతో అమెరికా తీరును యావత్తు దేశ ప్రజలు వ్యతిరేకిస్తుంటే మోడీ మాత్రం అలాయ్ బలాయ్ అంటూ అంబానీ,అదాని ప్రయోజనాలు కాపాడేందుకు తాపత్రయపడుతున్నాడని అన్నారు. దోపిడీ వ్యవస్థ పోవాలి.. సోషలిస్టు సమాజం కావాలని తొలినుంచి నూర్జహాన్ కోరుకుందని,అది ఎర్రజెండాతోనే సాధ్యమవుతుందని పూర్తిగా విశ్వసించినట్టు తెలిపారు. తాను మహిళా అని ఏ నాడు అనుకోలేదని,ఎక్కడ,ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా ఎర్రజెండాతో కొట్లాడేదని అన్నారు. తన పిల్లలను కూడా ఎర్రజెండా వారసులుగా పెంచారని,కుటుంబీకులను సైతం ప్రభావితం చేశారని గుర్తుచేశారు. క్రమశిక్షణకు మారుపేరని,మాట కఠినంగా ఉన్నా మనసు మెత్తన అని,భౌతికంగా మన మధ్య లేకున్నా ఆమె బాట మన ముందుందని,ఐక్య పోరాటాలను ముందుకు తీసుకెళ్లడమే నూర్జహాన్ కు నివాళి అని అన్నారు.

 

Nur Jahan's contribution to the united struggles of the working class

 

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రమ,జయలక్ష్మి,రాష్ట్ర కోశాధికారి ఒంగూరు రాములు,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు రమేశాబాబు,వృత్తిదారుల సంఘం కన్వీనర్ పెద్దివెంకట్రములు,ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత,గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్,ఆశ జిల్లా కార్యదర్శి సుకన్య, అంగన్వాడీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు  దేవ గంగు,స్వర్ణ,లిఫ్ట్ ఇరిగేషన్ నాయకులు గణేష్,శ్రీనివాస్,ఎఐటియుసి,టియుసిఐ, ఇప్టూ కార్మీక సంఘాల నాయకులు, కార్మీకులు, తదితరులు పాల్గొన్నారు.

 

Nur Jahan's contribution to the united struggles of the working class