. . . ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్
ఇందల్వాయి, బతుకమ్మ :
రికార్డుల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకూడదని, అక్రమాలు లేదా నిర్లక్ష్యం గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ అధికారులను హెచ్చరించారు. ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయాన్ని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులను పరిశీలించడంతో పాటు భూభారతి, పట్టా మార్పిడి సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్యను భూభారతి అమలు, పట్టా మార్పిడి తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఒకే పని కోసం రైతులు పదేపదే కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. పట్టా మార్పిడి, భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, కులం, ఆదాయం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఆన్లైన్లో నిర్దేశించిన గడువులోగా ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ బాలయ్య, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, జీపీఓ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
