. . . ఉల్లాస్ యాప్ పైన ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతం
. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాను 100% అక్షరాస్యత గల జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిజామాబాద్ జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ – అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మెప్మా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఉల్లాస్ యాప్పై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం శుక్రవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చదువు నేర్చుకోలేని, చదువు మధ్యలో మానేసిన వయోజనులను గుర్తించి, వారికి చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వారిని అక్షరాస్యులుగా మార్చాలని అన్నారు. ఇప్పటికే గుర్తించిన 6776 నిరక్షరాస్యులు, 497 వాలంటీర్ టీచర్లను ఉల్లాస్ యాప్లో నమోదు చేసి, లిటరసీ లెర్నింగ్ సెంటర్ల ద్వారా వారికి బోధన అందించి రానున్న ఎఫ్ఎల్ఎన్ఎటి / ఎన్ఐఓఎస్ పరీక్షలకు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ.పురుషోత్తం, మెప్మా డీఎంసీ మాధురి, అకౌంట్స్ ఆఫీసర్ విజయ, ఏపీఓ టి.అరుంధతి జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లు ఎం.సుమన్, ఎ. సత్యనారాయణ మూర్తి పాల్గొని ఉల్లాస్ యాప్ వినియోగం, అభ్యాసకుల నమోదు, వాలంటీర్ మ్యాపింగ్, కార్యక్రమ అమలుపై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో మెప్మా క్షేత్ర స్థాయి సిబ్బంది (టీఎంసీ లు, సీఓలు, ఆర్పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు) పాల్గొన్నారు. ఉల్లాస్ యాప్లో అభ్యాసకుల నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రదర్శించి, క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన విధానాలను వివరించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడగా, జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
